ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీలో హడావుడీ మొదలయ్యింది. తెలంగాణాలో సీఎం కేసీఆర్లాగా అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామన్న చంద్రబాబు మాటతో.. సిట్టింగ్ నాయకులలో ఉత్కంఠ రెండింతలయ్యింది. పనితీరు మార్చుకోవాలని గతంలో అనేకసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బాబు హెచ్చరించారు. ఈ సారి అభ్యర్తల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి జిల్లాలో ఇద్దరు నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాబు నేతల పనితీరు పట్ల అనేక సర్వేలు చేయించారు. ఆ సర్వేల అధారంగానే ఈ సారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని బాబు నిర్ణయం తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవ్వడంతో ఆ దిశగా తెలుగుదేశం కసరత్తు ముమ్మరం చేసింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశంలో చివరి నిమిషం వరకు తర్జన భర్జన ఉంటుందన్న అపవాదును తొలగించేలా ఈసారి ముందుగా అన్ని టికెట్లు ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. సంక్రాంతి తర్వాత మొదటి అభ్యర్తుల జాబితాను విడుదళ చేస్తామని పార్టీ నాయకులకు చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అలాగే మార్చాలనుకుంటున్న సిట్టింగ్ అభ్యర్థుల బాబు జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయోననే గుబులు నేతల్లో నెలకొంది.
నియోజక వర్గాల వారిగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో రెండు నుంచి మూడు స్థానాల్లో సిట్టింగ్లకు టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. విశాఖలోనూ రెండు మూడు చోట్ల కొత్త వారికి అవకాశం కల్పిస్తారని సమాచారం. తూర్పు గోదావరిలో టికెట్లు దక్కని సిట్టింగ్లు పార్టీ మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వారిని బాబు బుజ్జగిస్తారా లేదా అన్నది చూడాలి. టికెట్లు దక్కని నేతలకు నామినేటేడ్ పదువులు ఎరవేస్తున్నారు.
పశ్చిమ జిల్లాలో కూడా ఓ మంత్రి, మరో మాజీమంత్రికి టికెట్లు దక్కడం అనుమానమే అనే పరిస్థితి పార్టీ వర్గాల్లో ఉంది. కృష్ణాజిల్లాలో కూడా ఒకరిద్దరు సిట్టింగ్లకు సీటు కష్టమేనని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకరిద్దరు నేతల పనితీరుపై చంద్రబాబు చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నా వలసలతో సంఖ్య కొంత పెరిగింది.
అనంతలో కనీసం నలుగురు సిట్టింగ్లను మార్చే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలందరిపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రులైన కొందరు నేతలపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో సిట్టింగ్ స్థానాలను దక్కించుకునేందుకు పోటీ ఎక్కువగానే ఉంది.
రాయలసీమలో టికెట్ల కేటాయింపు ఈసారి కత్తిమీద సాము అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారా? లేక లోకేష్ను బరిలోకి దింపుతారా? అని ఆసక్తిగా మారింది. సీమలో జగన్కు చెక్ పెట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న బాబు టికెట్ల విషయంలో ఆచితూచి వ్యవరించనున్నారు. కడప జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జులుగా కొనసాగుతున్న వారిలో కొందరికే ఈసారి టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. టికెట్లు ఎవరికి కేటాయిస్తారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు.