తెలంగాణాలో టీఆర్ఎస్ ఓటమి టార్గెట్గా కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు కలసి మహాకూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో కూటమికి బీటలు పారుతున్నాయి. తెలంగాణలోని 119 స్థానాల్లో 95 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన 24 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని భావిస్తోంది.
14 స్థానాలను టీడీపీ, మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే టీజేఎస్ మాత్రం తమకు 11 స్థానాలను కావాలని కోరుతోంది. సీపీఐ కనీసం నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలను కోరుతోంది. అయితే వారు అనుకున్నన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా కనిపించడంలేదు.
కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల జాబితాను సోమవారం సాయంత్రం టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కు ఇచ్చింది. స్టేషన్ఘన్పూర్, ఆసిఫాబాద్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. దీనిపై కోదండ రామ్ గుర్రుగా ఉన్నారు. సీపీఐకు మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. కానీ, నాలుగు ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది.
ఇదలా ఉండగా సీపీఐకు కాంగ్రెస్ నుండి కొత్త ప్రతిపాదన వచ్చింది. బెల్లంపల్లి, ఆసిఫాబాద్. వైరా అసెంబ్లీ స్థానాలను కేటాయించనున్నట్టు కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. అయితే కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. కానీ కొత్తగూడెం సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రం సుముఖంగా లేదు. దీంతో కూటమి నుంచి తప్పుకొనేందుకు సీపీఐ ప్రయత్నాలు చేస్తోంది.
మరో వైపు టీజెఎస్ ఛీఫ్ కోదండరామ్ మగ్థూమ్ భవన్కు వెల్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో సీపీఐతో సీట్ల సర్దుబాటు అంశంపై కోదండరాం కీలక చర్చలు జరిపారనే వార్తలు వినిపించాయి. సీపీఐతో తాను మధ్యవర్తిత్వం చేయడానికి రాలేదని వివరణ ఇచ్చారు. సీట్ల సర్దుబాటు విషయంలో సీపీఐ ఆలోచన ఏంటో తెలుసుకుందామని వచ్చానని తెలిపారు. తమకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని… సీట్లు విషయంలో స్పష్టత వచ్చిన తరువాత అభ్యర్థుల గురించి ఆలోచిస్తామని కోదండరాం తెలిపారు. జరగుతున్న పరిణామాలు చూస్తుంటే కూటమి చీలడం కాయంగా కనిపిస్తోంది.
