ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక్కరోజు దీక్షకు దిగారు. కానీ ఏపీ ప్రయోజనాల కంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో అంటే బీజేపీ-టీడీపీ స్నేహమేరా జీవితం అన్నట్టు చెట్టాపట్టాలేసుకొని తిరిగే రోజుల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తే ఎన్ని విమర్శలు చేశారో మరిచిపోయి.. ఇప్పుడు అదే స్థానంలో దీక్షకు కుర్చున్నారు.
ఇక ఈ దీక్షలో ఏపీకి జరిగిన అన్యాయం కంటే మోదీనే ఎక్కువగా టార్గెట్ చేశారు. మోదీ ప్రధాని పదవికి అనర్హుడు.. మోదీకి పాలన చేతకాదు.. బీజేపీని అత్యవసరంగా దేశం నుంచి తరిమేయాలి.. ఇలా సాగింది ఆయన ప్రసంగం.
దీక్షకు పలు జాతీయ పార్టీలు సంఘీభావం పలికాయి. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ.. ఇంకా ఎందరో. ఒకానొక సమయంలో అసలు దీక్ష స్థలంలో ఒక్క చంద్రబాబు తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్ నేతలే. వీరంతా చంద్రబాబు దీక్షను అడ్డుపెట్టుకొని మోదీని ఏకీపారేశారు.. సారీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఓపెన్గా చెప్పాలంటే చంద్రబాబు దీక్షను ఎన్నికల ప్రచార సభగా మార్చుకున్నారు. ఏ పార్టీకైతే వ్యతిరేకంగా ఆనాడు దివంగత నేత ఎన్టీ రామారావు పార్టీ పెట్టారో.. అదే పార్టీతో ఈనాడు చంద్రబాబు కలిసి కూర్చోవడాన్ని మాత్రం అన్నగారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్పీ, ఎన్సీపీ, తృణముల్ కాంగ్రెస్ నేతలు కూడా దీక్షకు మద్దతుగా మైక్ పట్టుకొని మోదీపై విమర్శల వర్షం కురిపించారు.
మొత్తానికి చంద్రబాబు కొన్ని కోట్ల ప్రజాధనంతో నేతలను, కార్యకర్తలను, మీడియా ప్రతినిధులను బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో తీసుకెళ్లి, ఏసీ గదులు బుక్ చేసి వారికి కావాల్సిన సకల మర్యాదలు చేసి దీక్షకు కూర్చుంటే.. జాతీయ నేతలందరూ వచ్చి మోదీ వ్యతిరేక సభగా మార్చేశారు. దీంతో ఉదయం నుంచి ఆపకుండా లైవ్ నడుపుతున్న చానల్లను చూస్తున్న ప్రజలకు అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఏపీ కోసం దీక్ష చేస్తున్నారా? లేక ఇంత కష్టపడి మా డబ్బులన్ని తగలేసి వారి కోసం ఓ మీటింగ్ ఆర్గనైజ్ చేశారా? అన్న విషయం.
