కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన వెంటనే ఇండియా టుడే టీవీ–సీఎన్ఎక్స్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ఫలితాల్లో వైసీపీలో ప్రభంజనం కొనసాగింది. టీడీపీకీ షాక్ ఇచ్చేవిధంగా సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని ఘంటాపథంగా చెప్పింది. ప్రస్తుతం విపక్ష హోదాలో ఉన్న వైసీపీ స్టన్నింగ్ విక్టరీని అందుకుంటుందని తేల్చేసింది. కేవలం లోక్ సభ సీట్ల వరకే తన ఫలితాలను వెల్లడించింది.
రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తె ఈసారి ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమేనని తేల్చేసింది. టీడీపీ కేవలం ఊమూడు స్థానాలతో మాత్రమే సరిపెట్టుకుంది.
ఈ సర్వే ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందనేది స్పష్టం అయ్యింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. 2014లో 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 సీట్లను కోల్పోయి 238 స్థానాలను దక్కించుకునే అవకాశముందని తెలిపింది . బీజేపీకి 238 సీట్లు ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 285 సీట్లు వస్తాయని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
గతంలో 80 స్థానాలకే పరిమితమైన యూపీయే ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునేందుకు అవకాశాలున్నట్లు సర్వే తెలిపింది. అప్పుడు 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారీ మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమేనంది..మార్చి 1వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ఏపీకి సంబంధించిన ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో 8 సీట్లను గెలిచిన విపక్ష వైసీపీ ఈ దఫా ఏకంగా 22 సీట్లను గెలుచుకోనుందట.