జనసేన అధినేత పవన్ చంద్రబాబునాయుడుపై సున్నితంగా విమర్శలు చేస్తుంటారు. పాము చావద్దు..కట్టె విరగొద్దు అన్న చందంగా జనసేనుడి మాటలు ఉంటాయి. బాబును విమర్శిస్తారే తప్ప దానిమీద పోరాటం చేయాలనే చిత్తశుద్ది ఉండదు. తాజాగా పవన్ మరో సారి బాబుపై విమర్శులు ఎక్కుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల మత్స్యకారులు ఈ రోజు జనసేన అధినేత, సినీనటులు పవన్ కల్యాణ్తో సమావేశం జరిపారు. హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో మత్య్సకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవన్. మేనిఫెస్టోలో ఉంచిన హామీలకు కట్టుబడి ఉండాలని, వాటిని నెరవేర్చాలని పవన్ కల్యాణ్ అన్నారు. మేనిఫెస్టో అన్నది పార్టీకి ఒక గీటురాయి వంటిదన్నారు. మత్స్యకారుల సమస్యను గురించి కమిటీ వేస్తామని చెప్పారని అన్నారు. మత్స్యాకారులను ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నాలు జరపాలని సూచించారు.
మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, వారి సమస్యలపై మరింత అధ్యయనం చేస్తానని పవన్ తెలిపారు. తాను ఈ నెల 21న శ్రీకాకుళంలో పర్యటిస్తానని తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే, తీర ప్రాంతంలో కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శాంతియుతంగా వారు చేస్తోన్న దీక్షలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. మత్స్యాకారులను ఎస్టీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.