ఏపీ మాజీ చంద్రబాబుకు పార్టీ నేతలు షాక్ ఇస్తూనె ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో దాని ప్రభావం పార్టీపై పడుతోంది. పార్టీ ఓటమిపై చేస్తున్న సమీక్షలకు నాయకులు డుమ్మా కొడుతుండటంతో బాబు అభద్రతా భావంలో ఉన్నారు. తాజాగా బాబుకు జేసీ బ్రదర్స్, బాలయ్య బిగ్ షాక్ ఇచ్చారు.
పార్టీ ఓటమిపై అనంత పురం జిల్లా నేతలతో బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీ బ్రదర్స్, బాలయ్య డుమ్మా కొట్టారు. ఇప్పుడు ఇదే పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆదివారం తొలిసారి టీడీపి అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి బికే పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, శమంతకమణి, మేయర్ స్వరూప, మాజీ శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరు కాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జెసి పవన్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు.
హిందూపురం మాజీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి రాలేదు. బాలకృష్ణ కూడా సమావేశానికి రాలేదు. మరికొంతమంది నేతలు ఎందుకు డుమ్మా కొట్టారనే విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.