తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీల పొత్తుపై టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఉతికి ఆరేశారు. సిగ్గు లేకుండా చంద్రబాబుతో పొత్తు కలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ ను ఎదుర్కొనేదానికి బద్దశత్రువులయిన కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. థూ.. మీ బతుకులు చెడ.. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో.. తెలంగాణ ద్రోహి.. చెడిపోయి చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే మేం ఇస్తాం కదా నాలుగు సీట్లు అంటూ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, టీడీపీల పొత్తుల గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా బాధకలుగుతోందన్నారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్లీ మన బతుకులు అమరావతికి పోవాలా? చిల్లర అధికారం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా? కాంగ్రెస్ వాళ్లకు టికెట్ ఇచ్చేవాళ్లు ఇక్కడ ఉంటారా? వాళ్లు ఇది (చిటికెన వేలు చూపిస్తూ..) పోవాలన్నా ఢిల్లీ వెళ్తారు. వారిపైన మరో నలుగురు బాసులు ఉంటారు. ఏ నిర్ణయం వారి చేతుల్లో ఉండదు. వీరికి మనం గులాంగిరీ చేయాలా? అని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ నేతలను కేసీఆర్ విమర్శిస్తూ.. ‘‘చంద్రబాబుతో పొత్తా? ఇంతకంటే దిగజారుడు ఉంటుందా? మనం కోరుకునేది ఇదేనా? 7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు.సీలేరే పవర్ ప్రాజెక్టు గుంజుకున్నాడు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపడానికి కేంద్రానికి 36 లేఖలు రాశాడు. ఆ దుర్మార్గుడితోనే మీ పొత్తు?’’ అని కేసీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు.