విశాఖలో బహిరంగసభ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉపన్యాసం ఒక్క దెబ్బకు రెండు కాదు.. నాలుగైదు పిట్టలను కొట్టినట్టుగా ఉంది. ఒక్క చంద్రబాబునే కాదు.. అటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కుటుంబాన్ని.. ఇంకా చెప్పాలంటే కూటమిగా ఏర్పడి మోదీని ఢీకొట్టాలని కూటమిగా ఏర్పడుతున్న ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేశేలా మాట్లాడారు మోదీ.
ప్రజల అభివృద్ధిని గాలికొదిలి.. తమ కుటుంబాలు, తమ బంధువుల హోదా పెంచుకునేందుకు తహతహలాడుతున్నారని.. తమ సొంత లాభాలు తప్ప.. ఓ సిద్ధాంతమంటూ లేని ఈ పార్టీలు అధికారంలోకి వస్తే దేశానికి నష్టమేఅన్నారు మోదీ.
ఇక రాష్ట్ర విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వంలో బలమైన ప్రభుత్వం ఉంటే తమ ఆటలు సాగవని ఇక్కడి నేతలు భావిస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా సెటైర్ వేశారు. మోదీ అధికారంలో ఉంటే తాము ఇష్టారాజ్యంగా నడుచుకోవడం కుదరదని ఇక్కడి నాయకులు భయపడుతున్నారంటూ విమర్శించారు. ఇక్కడి నేతలకు యూటర్న్ తీసుకోవడం బాగా అలవాటన్నారు. అధికారం కోసం ఇక్కడి నేతలు ఎలాంటివారితో జట్టు కడుతున్నారో ప్రజలు గమనించాలని చంద్రబాబు-రాహుల్ గాంధీల కూటమిపై విమర్శలకు దిగారు.
ఇక ఏపీలోని కొందరు నేతలు మాటలు దారుణంగా ఉన్నాయని… వాళ్లు పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఉన్న కోపాన్ని దేశంపై చూపిస్తున్నారని.. ఇలాంటి నేతలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మోదీ.