సర్వేల అంచనాలను తలక్రిందులు చేస్తూ ఏపీలో వైసీపీ ఫ్యాన్ ప్రభంజనం ముందు సైకిల్ కొట్టుకుపోయింది. 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లతో విజయడఖా మోగించింది. ఈనెల 30 జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదలా ఉంటె ఇప్పుడే ఓడిపోయిన టీడీపీనేతల్లో భయం మొదలయ్యింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్, పార్టీని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఇబ్బందులకు గురిచేసిన నాయకులు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి ఆదినారయణరెడ్డి జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి గెలిచిన ఆది టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవిని పొందారు.ఇటీ వల జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ తరుపున పోటీ చేసిన ఆయన ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. మంత్రిగా కొనసాగుతున్న సమయంలో జగన్ను టార్గెట్ చేశారు. మరో వైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆది హస్తం ఉందనె ఆరోపనలు వచ్చిన సంగతి తెలిసిందే.
వైసీపీ ఘనవిజయం సాధించిన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది టీడీపీ నేతలను టార్గెట్ చేసిందనీ, వారిలో తాను మొదటిస్థానంలో ఉన్నానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీలో ఊహకు అందని ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ సీటు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా నాలుగు లోక్ సభ స్థానాల్లో విజయం సాధించడం ఏంటని ప్రశ్నించారు.
తనను వ్యతిరేకిస్తే నష్టపరుస్తానని మోదీ ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపించారని విమర్శించారు. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలకు అనుకూల ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. తమకు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయన్నారు.హిమకుంట గ్రామంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తే అక్కడ వైసీపీకే ఆధిక్యత వచ్చిందని గుర్తుచేశారు. మరి ఆది పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.