రాహుల్, చంద్రబాబులపై అదిరిపోయో సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. సన్యాసి….సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుందో, వీళ్లిద్దరూ కలుసుకుంటే కూడా అదే జరుగుతుందని ఎద్దేవ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి నియోజక రవ్గంలో నిర్వహించిన రోడ్ షో లో కేటీఆర్ మాట్లాడారు.
చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కలిసి ఆయన చేతిలో వీణ పెడితే, బాబు చేతిలో రాహుల్ ఫిడేల్ పెట్టారని అన్నారు. డిసెంబర్ 11 తర్వాత రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాహుల్ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవడం తప్ప, అయ్యేదేమీ లేదని సెటైర్లు విసిరారు.
మహాకూటమి తరుపున నందమూరి సుహాసినిని నిలబెట్టి ఆమెను బలిపశువుని చేశారని అన్నారు. నందమూరి కుటుంబంపై అంత ప్రేమే ఉంటే…లోకేష్కు ఇచ్చినట్లు….ఏపీలో మంత్రి పదవి ఇవ్వచ్చుకదాని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలన్న తపన ఉంటే లోకేష్ను బరిలో దింపాల్సిందని సూచించారు. నందమూరి కుటుంబం మీద చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే.. డైరెక్టుగా లోకేష్నుమంత్రి చేసినట్టు నందమూరి సుహాసినికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చంద్ర బాబు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ కూకట్ పల్లిలో టిడిపి గెలిస్తే అభివృద్దిలో వెనుకబడుతుందని … కాబట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. కేసీఆర్ ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని…వారి కుట్రలను తిప్పికొట్టాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు.
కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా ఆంధ్రా ప్రజలకు ఇబ్బంది కలిగిందా అని ప్రశ్నించారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రతినెలా పింఛన్ వచ్చేలా, కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్, కంటి వెలుగు లాంటి అనేక పథకాలను పెట్టామని తెలిపారు.
రాహుల్ గాంధీ, చంద్రబాబు ఒక్కటైనా.. ప్రజలు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల పాటు హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని కేటీఆర్ అన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు.