ఏపిలోని అధికార పార్టీ వైసీపీలో మరో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారినపడిన ఆయన గత నెల 13న హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం కర్నూలు జిల్లా అవుకు మండలంలోని ఉప్పలపాడు. 1983లో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో డోన్ నుంచి బరిలోకి దిగిన ఆయన పరాజయం పాలయ్యారు.
1991లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు. 1994లో కోవెలకుంట్ల నుంచి అసెంబ్లీకి బరిలోకి దిగి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. అయితే, 1999, 2004లలో మాత్రం భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
దేవునితో చెలగాటం వద్దు : సీఎం జగన్ మోహన్ రెడ్డి
దేవుడి ఎదుటకు మరో టీడీపీ ఎమ్మెల్యే!