ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ తొలి సారిగా స్పందించారు. ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఐదు కోట్ల మందిలో ఒక్కరికే వస్తుందని అలాంటి అదృష్టం ఇప్పుడు ప్రజలు నాకు ఇచ్చారన్నారు జగన్.ఈ విజయం తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. తనకు ఎంతో గొప్ప విజయం అందించిన ప్రజలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
ఏపీలో చరిత్రలో ఇది నూతన అధ్యాయమని చెప్పారు. ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. ఏడాది లోపే బెస్ట్ సీఎం అని ప్రజలందరి చేత అనిపించుకుంటానన్న జగన్..నవరత్నాల అమలే తన లక్ష్యమని స్పష్టంచేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. దాదాపు 150 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 79 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ..మరో 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార టీడీపీ 25 స్థానాలకే పరిమితమైంది. ఇక జనసేన ఏమాత్రం తన ప్రభావాన్ని చూపించలేకపోయింది.