వైసీపీ అధినేత జగన్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. 175రోజులుగా సాగుతున్న పాదయాత్ర.. 2వేల కిలోమీటర్లకు పైగా నడక.. మండిపోతున్న ఎండలు.. దీంతో జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో జగన్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు.
జ్వరంతో పాటు జలుబు, తలనొప్పితో జగన్ బాధపడుతూ ఉండటంతో, వైద్యులు ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో నేటి తన పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు వైకాపా నేతలు క్యూ కట్టారు. కాగా, రేపు ఆయన హైదరాబాద్ కు వచ్చి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సివుంది. కోర్టుకు జగన్ వస్తారా? లేక రాలేకపోతున్నట్టు పిటిషన్ సమర్పిస్తారా? అన్న విషయమై స్పష్టత లేదు.
నిజానికి మంగళవారం నుంచే జగన్ చాలా ఇబ్బందిపడుతున్నారు. కానీ అతి కష్టమ్మీద బుధవారం కూడా పాదయాత్ర చేశారు. ఇక రెస్ట్ తీసుకోకపోతే కష్టమని డాక్టర్లు చెప్పడంతో గురువారం విరామం ఇచ్చారు.