వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రజాసంకల్ప యాత్రకు కృష్ణా జిల్లా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. వేలాదిమంది ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్తో కలిసి అడుగులేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో జగన్ ప్రసంగించారు.
అన్యాయపు రాజుగారి దర్బారులో అవినీతి మంత్రి దేవినేని ఉమా అంటూ… జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ముడుపులు ఎంత రావాలో నిర్ణయిస్తే.. ఉమ వాటిని మూటలు గట్టి వాటాలు తీసుకుంటారని నిప్పులు చెరిగారు. వీరిద్దరూ కలిసి పట్టిసీమ నుంచి పోలవరం వరకు లంచాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.
2014 ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబా రావాలన్న బాబు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. బాబు ముకారవిందాన్ని చూసి ఉద్యోగాలు రావన్నారు. ప్రత్యేక హోదాతోనే ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో మండలానికో అంబులెన్స్ ఉండేది కానీ, ఇప్పుడు నియోజకవర్గానికి రెండు అంబులెన్స్లు మాత్రమే ఉన్నాయని, అంబులెన్సుల సిబ్బందికి కూడా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకొనేవిధంగా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. కుటుంబపెద్ద ఆపరేషన్ చేయించుకున్నాక విశ్రాంతి అవసరమైతే.. ఆ సమయంలో రోగులకు ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. డయాలసిస్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రూ. 10వేల పింఛన్ ఇస్తామని తెలిపారు.