కేంద్రంపై అవిశ్వాస తీర్మానంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నిన్నటి వరకు వైసీపీ ప్రవేశ పెట్టబోయో అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన బాబు హటాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. సొంతంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని నిర్ణయం తీసుకున్నారు.
ఇదంతా బాగానే ఉన్నా టీడీపీలోకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీల భవిష్యత్తు అంధకారంలో పడింది. టిడిపి కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వటంతో వారి గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. వైసిపి తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తా గీత టిడిపిలోకి ఫిరాయించారు. ఇప్పుడు రెండు పార్టీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాలతో ముగ్గురు నడి ఊబిలో చిక్కుకు పోయారు.
అవిశ్వాస తీర్మానం ప్రకారం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ తన ఎంపిలకు వైసిపి విప్ జారీ చేసింది. విప్ ను ఉల్లంఘిస్తే సభ్వత్వం పోవటం ఖాయం. అలాగని ఓటింగ్ కు గైర్హాజరయ్యేందుకూ లేదు. ఎటు ఓటు వేసినా, ఓటింగ్ నుండి గైర్హాజరైనా చివరకు పోయేది వారి సభ్యత్వమే.
ఇప్పుడు ఓటు ఎవరికి వేయాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఇన్నాల్లు ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబుకు వదిలేశారు. కాని బాబు హఠాత్తుగా అవిశ్వాసంపై నిర్ణయం మార్చుకోవడంతో ఫిరాయింపు ఎంపీలు ఇరుక్కుపోయారు. ప్రస్తుతం వారి పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా పరిస్థితి తయారయ్యింది.