ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను నెరవేర్చాలని పార్టీ ఎంపీలు ఆమరణ నిరహాద దీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన రోజా బాబుపై విమర్శల వర్షం కురిపించారు. జగన్ ఎంపీల చేత రాజీనామా చేయించారని మరి అదే పనిని చంద్రబాబు ఎందుకు చేయించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేవా అని ప్రశ్నించారు. కావాలనే మోదీ ఇంటివరకూ వెళ్లిన టీడీపీ ఎంపీలు వారంతట వారే అరెస్ట్ అయి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని అన్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తూ, పదవులను వదులుకుంటుంటే, టీడీపీ ప్రజల పక్షాన్ని వదిలేసి పదవులను పట్టుకు వేలాడుతోందని ఆరోపించారు. ఎంపీలంతా రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని, కానీ, తనపై ఉన్న కేసుల భయంతో చంద్రబాబు బీజేపీ ముందు నాలుగేళ్ల పాటు తలొగ్గి నిలబడ్డారని ఎద్దేవ చేశారు.