ప్రత్యేకహోదాపై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఎంపీలు ఫైర్ అయ్యారు. అవిశ్వాస తీర్మానంపై భాజాపా, వైసీపీ కుమ్మక్కయ్యారంటూ టీడీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క, ప్రత్యేక హోదా డిమాండ్తో గురువారం ఆంధ్రప్రదేశ్ అంతటా రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది.
ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చంద్రబాబు కృష్టి చేయాలి. నాలుగేళ్లుగా బీజేపీతో కాపురం చేసి టీడీపీ చేసిందేమీ లేదు. కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తాం. అవిశ్వాసంపై సహకరించాలని పలు పార్టీలను కోరుతున్నాం. చంద్రబాబు తీరువల్లే విభజన హామీలు నెరవేరట్లేదని వైసీపీ ఎంపీలు మండి పడ్డారు.
ప్రజల ఒత్తిడి మేరకే చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. లాలుచీ రాజకీయాలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. విభజన హామీల కోసం నాలుగేళ్లుగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాకు విలన్ చంద్రబాబే. వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానానికి క్రెడిట్ వస్తుందని చంద్రబాబు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు.