ఏపీ అసెంబ్లీలో చివరి రోజు ఓ అసక్తికర విషయం చోటుచేసుకోంది. గత రెండు రోజుల్లాగే శనివారం కూడ వైసీపీ ఎమ్మల్యేలు స్పీకర్ పోడియం వద్ద బల్లలు ఎక్కి ఆందోళన చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చర్చకు ప్రభుత్వం అంగీకరించపోవడంతో కాగితాలు చించి స్పీకర్ మీదకు విసిరారు. దీంతో అసెంబ్లీ పలుసార్లు వాయిదా పడింది.
అసెంబ్లీ వాయిదా పడగానే ఇంకేముంది… ఎమ్మెల్యేలంతా బిలబిలమంటూ మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. అక్కడ మరో గొడవ. మీడియా పాయింట్ లో మైకు కోసం టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత సద్దుమణిగాక అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక్కడే ఆ ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. శాసన వ్యవహారాల మంత్రి యనమల మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేల తీరును తప్పుపట్టారు. మూడేళ్లపాటు సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు.
అయితే ఇక్కడే ఉంది తకరారు. అదేమంటే ఎమ్మెల్యేల పదవీకాలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. అలాంటప్పుడు మూడేళ్లపాటు ఎలా సస్పెండ్ చేస్తారనేది అసలు ప్రశ్న. ఇంతేకాదు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇలాంటి తప్పులే చేశారు. ఆ సమయంలోనూ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వారిలో అప్పటికే సస్పెన్సన్ లో ఉన్న రోజా పేరు కూడా చదివేశారు. అంతేకాదు. వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేరు కూడా చదివేశారుమంత్రి యనమల గారు. పదే పదే జరుగుతున్న ఇలాంటి తప్పుల వల్ల ప్రభుత్వం అభాసుపాలవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Related
