వ్యక్తిగత శత్రుత్వం – రాజకీయ శత్రుత్వం రెండూ వేరు వేరు. రెండిటికీ మధ్యన పెద్ద లక్షణ రేఖ ఉంటుంది. వ్యక్తిగతం ఎప్పుడూ రాజకీయం అవ్వకూడదు రాజకీయం ఎప్పుడూ వ్యక్తిగతం అవ్వకూడదు.
దివంగత వైఎస్ కావొచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ.. లక్ష్మణ రేఖల్ని దాటే ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. కానీ.. తగ్గుతున్న ఓపిక.. సహనం.. ప్రత్యర్థిపై తిరుగులేని పైచేయి సాధించాలన్న కాంక్ష కొన్నిసార్లు తప్పులు చేయిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి తప్పునే ఏపీ ముఖ్యమంత్రి చేస్తున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. బాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటుందని చెప్పే మీడియా సంస్థ ఒకటి ఆసక్తికర కథనాన్ని తీసుకొచ్చింది.
ఈ కథనంలో బాబు.. తన పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా.. అధినేతతో తమ మనసులోని ఒక సందేహాన్ని బయటపెట్టినట్లుగా రాసుకొచ్చింది. విపక్ష నేత వైఎస్ జగన్ విషయంలో దర్యాప్తు సంస్థలు మెతక వైఖరి అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందన్న మాటను అధినేత చెవిన వేశారట. ఈ సందర్భంగా చంద్రబాబు సైతం.. సీబీఐ తీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లుగా సదరు కథనం పేర్కొంది.
జగన్ మీద కేసుల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని.. ఎంతకూ ముందుకు కదలటం లేదన్న మాటను బాబు సైతం తమ్ముళ్లతో చెప్పినట్లుగా చెబుతున్నారు. యూపీఏ హయాంలో జగన్ మీద అవినీతి ఆరోపణలపై కేసులు నమోదు కావటం.. ఆయన జైలుకు వెళ్లటం.. సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న పిమ్మట.. బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓడినప్పటికీ.. ఆయనపై కేసుల విషయంలో ఇప్పటివరకూ పెద్ద పురోగతి సాధించలేదనే చెప్పాలి. బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినప్పటికీ.. జగన్ కేసుల విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించని చంద్రబాబు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తమ్ముళ్లతో మాట్లాడటమే కాదు.. జగన్ కేసుల విషయంలో పురోగతి విషయంపై కేంద్రానికి.. కోర్టుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.