నిత్యం ప్రజల్లో ఉంటాడు.. ఏ సమస్య వచ్చినా ముందు వాలిపోతాడు.. నిత్యం ప్రజా జీవితంలో మునుగుతుంటాడు.. ప్రజల కోసం రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తుంటాడు.. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంటుంది.. జనాలు నీరాజనాలు పలుకుతారు.. కానీ ఫలితం ఉండదు. ఇది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నుంచే ఈ పద్ధతిలో జగన్ బిజీబిజీగా ఉన్నాడు. నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్నా అతడికి కలిసి రావడం లేదు. అతడికి ప్రజలు నీరజనాలు, ఘన స్వాగతం పలుకుతున్నా ఓట్లు వేయడం లేదు. దాదాపు ఏడేళ్లుగా ప్రజా జీవితంలో బిజీగా ఉంటున్న జగన్ జన్మదినం ఈ రోజు (డిసెంబర్ 21). ప్రస్తుత రాజకీయాలతో జగన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూద్దాం.
ఈ పరిస్థితి 2014 ఎన్నికల నుంచి మొదలైంది. 2014 ఎన్నికల్లో జగన్ తనదే విజయమని అత్యుత్సాహంతో దూసుకెళ్లాడు. బోల్తా పడ్డాడు. ఆ తర్వాత కొంచెం తేరుకొని నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్నాడు. చంద్రబాబు, మోదీ, పవన్ ఏకమై జగన్ను తొక్కేసి అధికారంలోకి టీడీపీని తీసుకువచ్చారు. అమరావతి నిర్మాణం, రుణమాఫీ, ఫీజ్ రీంఎంబర్స్మెంట్, ఓదార్పు యాత్ర, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం తదితర సమస్యపై వరుసగా పోరాటాలు చేస్తున్నాడు. ఎక్కడైనా సమస్య వచ్చినా వాలిపోతున్నాడు. పుష్కరాలు, పోలవరం నిర్మాణంపై వరుస పోరాటాలు చేశాడు. అసెంబ్లీలో గొంతెత్తి అరుస్తున్నాడు. ఇలా చేస్తున్నా అతడికి ఫలితం లేదు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నిక, రాజమండ్రి, కాకినాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. దీంతో జగన్ నైరాశ్యంలో ఉండగా అధికార టీడీపీ విజయ గర్వంతో ఉంది. ఇక జగన్ పనైపోయిందని అందరూ అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ ముందస్తు జాగ్రత్తగా 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజా సంకల్ప యాత్ర అంటూ ఆరు నెలల పాటు జమ్మలమడుగు నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. ఇంత సుదీర్ఘ యాత్ర తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మాదిరిగా చేస్తున్నాడు. మరీ తన తండ్రికి కలిసొచ్చినట్టు ఈ యాత్ర కలిసొస్తుందో లేదో చూడాలి. చివరికి జన్మదినం (డిసెంబర్ 21) కూడా ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చేసుకున్నాడు.
టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. టీడీపీకి బీజేపీనే ప్రధాన బలం. ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమే. చంద్రబాబుకు మద్దతుగా పవన్కల్యాణ్ కూడా ఉండడంతో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం దాదాపు ఉండడం లేదు. ప్రస్తుతం పవన్కల్యాణ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెబుతుండడంతో జగన్కు మళ్లీ అధికారం దూరమైనట్టే కనిపిస్తోంది.
