రాజంపేట… కడప జిల్లాలో టీడీపీ సత్తా చాటిన ఏకైక నియోజకవర్గమిది. సుమారు 15 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ తన జెండాను ఎగరేసిందని చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిపై 11 వేల ఓట్ల తేడాతో మేడా మల్లిఖార్జున రెడ్డి విజయం సాధించారు. దీనికి మేడా సొంత ఇమేజీ కొంత కారణమైతే.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత మరికొంత అని చెప్పుకోవచ్చు. అయితే కాలం, పరిస్థితులు మారాయి. గడిచిన మూడేళ్లుగా ప్రభుత్వ విప్ గా ఉన్న మల్లిఖార్జున్ రెడ్డి నియోజకవర్గంలో పట్టుకోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కుల, సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసే నియోజకవర్గం కావడంతో మేడా ఆటలు అక్కడ సాగలేదనే చెప్పాలి. దీంతో సొంత పార్టీలోనే వేరు కుంపటిని మేడా ఎదుర్కోన్నారు. ఆ పోరు పడలేక ఎన్నికల ముందు టీడీపీకి టాటా చెప్పి.. వైఎస్ఆర్సీపీకి షేక్హ్యాండ్ ఇచ్చారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు కుల సామాజికవర్గాల వారీగా ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక ఇరు పార్టీలకు కీలకంగా మారింది. మొన్నటి వరకు తనకే టికెట్ కేటాయిస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్న అమర్నాథ్ రెడ్డి భవితవ్యం ఇప్పుడు మెడా ఎంట్రీతో డైలామాలో పడింది.
ఇక ఇక్కడ టీడీపీ అధినేత ఆలోచనలు వేరేలా ఉన్నాయి. రాజంపేట అంటేనే బలిజ, క్షత్రియ సామాజిక వర్గాలకు పెట్టని కోట. 2019 ఎన్నికల అభ్యర్థిని కూడా ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చిన నేతకే దాదాపు ఖరారు చేస్తున్నట్టు టాక్. కానీ అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మేడా పార్టీ మారడం.. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని.. బలిజ, క్షత్రియ సామాజిక వర్గాల నుంచి వచ్చిన నేతను పోటీలోకి దింపితే టీడీపీ గెలుపు ఖాయమనే ఆలోచనలో టీడీపీ ఉంది. ఇప్పుడు రాజంపేట టీడీపీ అభ్యర్థి ఎవరన్నది ప్రశ్న? దీనికి సమాధానంగా మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడి పేరు వినిపిస్తోంది. రాజంపేట పంచాయతీ మొదలైనప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించిన ప్రతి సమావేశంలో చెంగల్రాయుడు యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే టికెట్ ఆశావాహులంతా మంత్రులను, చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థిగా చెంగల్రాయుడు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేడా బరిలోకి దిగితే అధికార పార్టీ గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. అమర్నాథ్ రెడ్డిపై ఉన్న సింపతి… వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను మేడాకు వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తోందని.. అదీకాక ప్రజల్లో మేడాపై ఉన్న వ్యతిరేకత.. అక్కడి బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన నేతను టీడీపీ బరిలోకి దింపుతుంది కాబట్టి ఇవన్ని కలిసి టీడీపీని గెలిపిస్తాయని లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మేడా టీడీపీని వదిలేసినట్టు కాకుండా.. టీడీపీనే మేడాకు చెక్ పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ జనసేన మాత్రం సీన్లోకి ఎంటరై.. తమ అభ్యర్థిని మాత్రం రంగంలోకి దించితే సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.