ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అసాధారణ పోరాటం వృథా అయ్యింది. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు 162 పరుగులకే కుప్పకూలిపోయింది.
చేతిలో 5 వికెట్లు ఉండగా 84 పరుగుల విజయ లక్ష్యంతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను తొలి ఓవర్లోనే ఆండర్సన్ బోల్తా కొట్టించాడు. 20 పరుగులు చేసిన కార్తీక్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లి (51: 93 బంతుల్లో 4×4) మరోసారి వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. మిగిలిన బ్యాట్స్మెన్లు విఫలమవడంతో భారత్కి పరాజయం తప్పలేదు. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో 31 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యాన్ని అందుకుంది. రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 9 నుంచి జరగనుంది.
ఓవర్నైట్ స్కోరు 110/5తో శనివారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత జట్టుకి తొలి సెషన్ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం సాయంత్రం.. విరాట్ కోహ్లికి చక్కటి సహకారం అందించిన దినేశ్ కార్తీక్ (20) ఈ రోజు జట్టు స్కోరు 112 వద్దే పేలవ రీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (31: 61 బంతుల్లో 4×4)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించిన కోహ్లి భారత్ని గెలిపించేలా కనిపించాడు. కోహ్లి కెరీర్లో 17వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే.. బెన్స్టోక్స్ బౌలింగ్లో ఔటైపోయాడు. దీంతో.. భారత్ గెలుపు ఆశలు ఆవిరైపోయాయి.
అనంతరం మొహమ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (11) పెవిలియన్ చేరారు. కాసేపు పోరాడిన హార్ధిక్ పాండ్యా 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఉమేష్ యాదవ్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లో స్టోక్స్ 4, ఆండర్సర్, బ్రాడ్ లు చెరో 2, కరణ్, రషీద్ లు చెరో వికెట్ తీశారు.