యాషెస్ సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న స్మిత్ కోహ్లీ టెస్ట్ ర్యాంకింగ్ కు ఎసరు పెట్టారు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్లో. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో స్మిత్ విరాట్కు కేవలం తొమ్మిది పాయింట్ల దూరంలో ఉన్నాడు.కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వెనక్కి నెట్టిన స్మిత్ 913పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు.
జరుగుతున్న యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు సాధించాడు. అలాగే రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లోనూ అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ బౌలింగ్ లో గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.ఇదే ఫామ్ను కొనసాగిస్తే స్మిత్ టాప్లో నిలవడం ఖాయం.
వెస్టిండీస్తో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుండటంతో కోహ్లి రాణించడంపైనే అతని టాప్ ర్యాంకు ఆధారపడి వుంటుంది.చివరగా ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న క్రమంలో కోహ్లి 922 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకుని టాప్కు చేరుకున్నాడు.నాలుగో స్థానంలో ఇండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా ఉండగా, శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే తొలిసారి టాప్ టెన్ లోకి ప్రవేశించారు.
బౌలర్ల విషయానికొస్తే, ప్యాట్ కమిన్స్ తొలిస్థానం ఆక్రమించాడు. జడేజా ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకాడు. అతని సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ 10వ స్థానంలో ఉన్నాడు. టీమ్ ర్యాంకింగ్లో ఇండియా 113 పాయింట్లతో టాప్లో ఉండగా, న్యూజీలాండ్ 111పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఏడాదిపైగా నిషేధం ఎదుర్కొన్న స్మిత్ టాప్-10ను కాపాడుకోవడమే కాకుండా టాప్-2కు రావడం ఇక్కడ విశేషం