బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడిన భారత్ జట్టు 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్లో డక్ వర్త్ లూయీస్ పద్దతి కోహ్లీసేన ఓటమికి కారణాలని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్పై పట్టుసాధిస్తున్న తరుణంలో అనూహ్యంగా వచ్చిన వర్షం.. అన్నింటినీ తలకిందులు చేసేసి.. ఆతిథ్య ఆస్ట్రేలియాకి అనుకూలంగా మార్చేసింది. అయినప్పటికీ పట్టు వదలకుండా చివరి వరకూ పోరాడిన భారత్ ప్రశంసలను అందుకుంది.
దానికి తోడు కృనాల్ పాండ్య భారీగా పరుగులు సమర్పించుకోవడం…రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ విఫలమవ్వడమే భారత జట్టు ఓటమికి కారణాలు అయ్యుండొచ్చు. కానీ చేజింగ్ చేసే టీమ్కు ఏనాడూ అనుకూలించని డక్ వర్త్ లూయిస్ పద్దతే కొహ్లీ సేన కొంపముంచింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ 16.1 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ఆధారంగా భారత్ విజయ లక్ష్యం 174 పరుగులుగా నిర్ణయించారు.
ఐపీఎల్ అనుభవం పుష్కలంగా ఉన్న భారత్ ఆటగాళ్లు 102 బంతుల్లో 159 పరుగుల్ని అలవోకగా ఊదేసేవారు. కానీ.. 102 బంతుల్లో 174 పరుగులు అంటే.. అదనంగా 15 పరుగులు కలపడం.. అదీ బోనస్గా ప్రత్యర్థికి లభించడం టీమిండియాని మానసికంగా దెబ్బతీసింది. అయినప్పటికీ.. శిఖర్ ధావన్ (76: 42 బంతుల్లో 10×4, 2×6), దినేశ్ కార్తీక్ (30: 13 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడటంతో భారత్ 17 ఓవర్లలో 169/7తో నిలిచింది.