ఆస్ట్రేలియా–భారత్ టి20 సిరీస్… ఆఖరికి వచ్చింది. రెండు జట్ల మధ్య ఆదివారం సిడ్నీ క్రికెట్ మైదానంలో చివరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 1–0 ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టును ఇందులో ఓడించి… 1–1తో లెక్క సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తద్వారా ఈ ఫార్మాట్లో వరుసగా ఏడు సిరీస్లు నెగ్గిన తర్వాత ఓటమి ఎదురు కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. మరోవైపు చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద జట్టుపై సిరీస్ విజయం సాధించే అవకాశాన్ని కంగారూలు అంత తేలిగ్గా వదులుకుంటారని భావించలేం.
ఈ నేపథ్యంలో మూడో టి20లో ఎవరికి అనుకూల ‘ముగింపు’ దక్కుతుందో చూడాలి. ధావన్ ఫామ్కు, కోహ్లి, రోహిత్ జోరు తోడైతే లక్ష్యాన్ని అవలీలగా అందుకోగలం. మన బౌలర్ల ఫామ్ ప్రకారం చూస్తే… మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇక ఆసీస్ విషయానికి వస్తే ..ఓపెనర్లు డీయార్సీ షార్ట్, కెప్టెన్ ఫించ్ వైఫల్యంతో లిన్, మ్యాక్స్వెల్, మెక్డెర్మాట్లపై బ్యాటింగ్ భారం పడుతోంది. అయితే, పొట్టి ఫార్మాట్లో ఏ క్షణమైనా విరుచుకుపడే వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. గాయపడిన స్టాన్లేక్ స్థానంలో సిడ్నీ మ్యాచ్కు కీలక పేసర్ మిచెల్ స్టార్క్ను జట్టుతో చేర్చినా అతడు ఆడేది అనుమానమే. ఆండ్రూ టైతో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా టీమిండియాను ఎంతమేరకు నిలువరిస్తారనే దానిపైనే ఆసీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.