ఎడ్జ్బాస్టన్ టెస్టులో కెప్టెన్ కోహ్లి రాణించినా.. మిగతా బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేయడంతో టీమిండియా ఓటమి పాలయ్యింది. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ లార్డ్స్లో భారత్ 17 టెస్టులు ఆడితే కేవలం రెండింట్లోనే గెలుపొందింది. తొలి టెస్టులో కొద్ది తేడాతో ఓడటంతో రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే కసితో భారత్ బరిలో దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ కోహ్లికి సచిన్ సలహాలు ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది.
కోహ్లికి తనిచ్చే సలహా తన దూకుడును ఇలానే కొనసాగించాలని చెప్పడమేనని సచిన్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు తెలిపాడు. తొలి టెస్టులో ఆడినట్టుగానే.. అదే ఆటతీరును కనబర్చు. అద్భుతంగా ఆడుతున్నావ్.. దాన్నే కొనసాగించ’మని కోహ్లికి సచిన్ సలహా ఇచ్చాడు. ‘చుట్టూ ఏం జరుగుతుందో నీకు అనవసరం. నువ్వేం చేయాలని అనుకుంటున్నావో దాని మీదే ఏకాగ్రత పెట్టు..తన చుట్టు ఏం జరుగుతుందో అనేది తనకనవసరం. తన లక్ష్యంపేనే నీ దృష్టి సారించాలి. అతని మనస్సుకు అనిపించింది చేసుకుంటూ ముందుకు సాగాలి. గత పర్యటన పరాభవం గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని’ సూచించాడు.
ఒక్కసారి నీలో సంతృప్తి కనపడిందో పతనం ప్రారంభం అవుతుంది. సంతోషంగా ఉండటం ఓకే కానీ, బ్యాట్స్మెన్గా ఎప్పటికీ సంతృప్తి చెందొద్దని సచిన్ సీరియస్ సలహా ఇచ్చాడు. బౌలర్లు కేవలం పది వికెట్లు మాత్రమే తీయగలరు. కానీ బ్యాట్స్మెన్ అలా కాదు.. ఎన్ని పరుగులైనా చేయగలరు. కాబట్టి సంతృప్తి చెందొద్దు, సంతోషంగా మాత్రమే ఉండాలని క్రికెట్ గాడ్ సూచించాడు.