ఐపీఎల్ 2018 లో డిఫెండింగ్ ఛాంపియయన్గా బరిలోకి దిగిన ముంబయ్ ఇండియన్స్ జట్టు ఏ దశలోనూ ఆకట్టుకోలేక పోయింది. విజయాల్ని అందించే బ్యాట్స్మెన్లు ఉన్నా పేవల ఆటతీరును ప్రదర్శించింది. ప్లేఆఫ్ ఆశల్ని వదులుకున్న సమయంలో అదృష్టం కలసి వచ్చింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో శుక్రవారం రాత్రి జరిగిన చావోరేవో మ్యాచ్లో ఘనవిజయం సాధించింది ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
జట్టు ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (57: 42 బంతుల్లో 6×4, 3×6), హిట్టర్ క్రునాల్ పాండ్య (31 నాటౌట్: 12 బంతుల్లో 4×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 175 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే ముంబయి ఇండియన్స్ 176/4తో ఛేదించేసింది. విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన దశలో.. బౌలింగ్కి వచ్చిన స్టాయినిస్ ఓవర్లో రోహిత్ శర్మ (24 నాటౌట్: 15 బంతుల్లో 1×4, 2×6) ఒక ఫోర్ కొట్టగా.. క్రునాల్ పాండ్య చివరి మూడు బంతుల్నీ 4, 4, 6గా మలిచేశాడు. తర్వాత ఓవర్ వేసిన ఆండ్రూ టై బౌలింగ్లోనూ క్రునాల్ ఒక ఫోర్, ఒక సిక్స్ బాదేయడంతో.. ముంబయి అలవోక విజయాన్ని అందుకుంది.
అంతకముందు ఓపెనర్లు క్రిస్గేల్ (50: 40 బంతుల్లో 6×4, 2×6), కేఎల్ రాహుల్ (24: 20 బంతుల్లో 1×4, 2×6) పంజాబ్ జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ తడబడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. క్రిస్గేల్ ధాటికి తొలి 10 ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న ముంబయి బౌలర్లు.. చివర్లో పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టి పంజాబ్పై ఒత్తిడి పెంచారు.
