భార్య ఆరోపణలు, యాక్సిడెంట్ తో ఇబ్బంది పడిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమి ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ శిబిరంలో చేరాడు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో డేర్ డెవిల్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి, సన్నాహక మ్యాచ్ లు ఆడుతున్నారు.
మహిళలతో సంబంధాలు ఉన్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడంటూ షమిపై అతని భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కూడా చేపట్టారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపరణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధికారులు కూడా దర్యాప్తు చేపట్టగా అందులో ఎలాంటి నిజంలేదని తేలింది. దీంతో బీసీసీఐ షమికి కాంట్రాక్టు ఇవ్వడంతో పాటు ఐపీఎల్లో ఆడేందుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇటీవల షమి ప్రాక్టీసులో పాల్గొని వస్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన షమి పూర్తిగా కోలుకుని సోమవారం దిల్లీ డేర్డెవిల్స్ జట్టులో చేరాడు. సహచర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. షమీ చేరికతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలంగా తయారైంది.