ఈ ఏడాది ఐపీఎల్లో బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. సాధారణంగా క్రికెట్ మ్యాచుల్లో స్ట్రాటజిక్ టైమ్ ఔట్ను సూచించేందుకు అంపైర్ తన రెండు చేతులతొ ఆంగ్ల అక్షరం ‘T’ రూపంలో చూపిస్తారు. అయితే డీఆర్ఎస్ను ఆశ్రయించే క్రమంలో కూడా ఆటగాళ్లు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.
అయితే ఈ ఏడాది ఐపీఎల్లో అంపైర్లు స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అని ఆటగాళ్లకు సూచించేందుకు కొత్త పద్ధతిని తీసుకువస్తున్నట్లు సమాచారం. అంపైర్లు ‘T’లా చూపించే బదులు తమ చేతి మణికట్టును పైకి ఎత్తి చూపించనున్నారు. ఐపీఎల్లో అంపైర్లగా విధులు నిర్వహించే వారికి ఇప్పటికే దీనిపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఐపీఎల్లో సాధారణంగా రెండన్నర నిమిషాల పాటు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ని ఇస్తారు. బౌలింగ్ సైడ్ జట్టు మ్యాచ్.. ఆరో ఓవర్ నుంచి తొమ్మిదో ఓవర్లోపు ఈ వెసులబాటుని ఒకసారి వినియోగించుకోవచ్చు.. బ్యాటింగ్ సైడ్ జట్టు 13వ ఓవర్ నుంచి 16వ ఓవర్లోపు ఒకసారి వాడుకోవచ్చు. ఇలా మ్యాచ్లో నాలుగు సార్లు ఈ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ని అంపైర్లు ఇస్తారు.
ఈ ఏడాది నుంచి ‘డీఆర్ఎస్’ను కూడా టోర్నీలో ప్రవేశపెడుతుండటంతో.. రెండు సిగ్నల్స్ ఒకే తరహాలో ఉండి.. మ్యాచ్ అధికారులు, అభిమానుల్ని తికమక పెట్టనున్నాయి. దీంతో.. స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సిగ్నల్ను మార్చాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఐపీఎల్లో పనిచేయబోయే భారత అంపైర్లకి శిక్షణ ఇస్తున్నారు.
