మహమ్మద్ షమీ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వివాహేతర సంబంధాలపై భార్య ఫిర్యాదుతో షమీపై పలు సెక్సన్ల కింద కోల్కతా పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో భాగంగా బీసీసీఐని సంప్రదించారు పోలీసులు.
షమీ దక్షిణాఫ్రికా పర్యటన వివరాలు అందజేయాలని వారు క్రికెట్ బోర్డును కోరారు. భారత క్రికెట్ జట్టు ప్రయాణ వివరాలు అందజేయాలని కోరుతూ మంగళవారం కోల్కతా పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు. డిసెంబర్ చివర్లో భారత జట్టు దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లింది. ఆ పర్యటన ఆసాంతం షమీ జట్టుతోనే ఉన్నాడా? లేదంటే ఎక్కడికైనా వెళ్లాడా అనే వివరాలు అందజేయాలని పోలీసులు కోరుతున్నారు.
భారత జట్టులోని ఇతర ఆటగాళ్లు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి రాగా.. షమీ మాత్రం దుబాయ్లోనే ఉండిపోయాడని, ఫిబ్రవరి 18న అక్కడ హోటల్లో పాకిస్థానీ మహిళతో గడిపాడని అతడి భార్య హసీన్ జహాన్ ఆరోపిస్తోంది. అందుకే టెస్టు, వన్డే సిరీస్ ఆడిన షమీ మిగతా ఆటగాళ్లతోపాటే సఫారీ గడ్డ నుంచి తిరిగి ప్రయాణమయ్యాడా? లేదంటే దుబాయ్లో గడిపి.. సొంత ఖర్చులతో భారత్ వచ్చాడా అనే వివరాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోర్టు బయట కేసును పరిస్కరించుకొనేందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు.