భార్య హసీన్ జహాన్ ఆరోపణలతో గత కొన్ని రోజులుగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా షమీని విడచిపెట్టే ప్రసక్తేలేదని అతడి భార్య హసీన్ జహాన్ పేర్కొంది. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన హసీన్ ఇప్పుడు మళ్లీ కొత్త ఆరోపనలు చేసింది.
లండన్కు చెందిన మహమ్మద్ భాయ్ అనే వ్యాపారి ఒకరు షమీకి అమ్మాయిలను పరిచయం చేశాడని ఆమె ఆరోపించింది. గురువారం మీడియాతో మాట్లాడిన హసీన్.. తన పోరాటాన్ని మధ్యలో వదిలేసే ప్రసక్తేలేదని చెప్పింది. మా పోరాటం ఓ స్థాయికి చేరింది. ఇప్పుడిక రాజీపడే ప్రశ్నేలేదు. నేను ఒంటరిగా పోరాడుతున్నా. దీన్ని ఇప్పుడు మధ్యలోనే వదిలేస్తే మొత్తం మహిళా సమాజానికే ఓటమిలా పరిణమిస్తుంది. నేను అలా ఎందుకు చేస్తా? నా వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’ అని హసీన్ చెప్పింది.
షమి తనకు ప్రాణ హాని ఉందని హసీన్ ఆరోపించింది. పోలీసుల రక్షణ కోరడాన్ని ఆమె సమర్థించుుంది. ‘షమి ఇవాళ ఉదయం కూడా ఫోన్ చేశాడు. నీకు సిగ్గుగా లేదా? నన్ను ఇరికించావు అని బెదిరించాడు. కూతుళ్లు, తన భవిష్యత్ దృష్ట్యా ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని కోరాడు’ అని హసీన్ చెప్పుకొచ్చింది. ఇక ఈకేసు ఇంకా ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటుందో చూడాలి.