దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ను మరింత అందుబాటులో ఉంచేందుకు పీఎం-కేర్స్ నిధి నుంచి రూ.201.58 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. ప్రధానంగా కొవిడ్ బారిన పడినవారికి, వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి అవసరమైన ఆక్సిజన్ను తగినంతగా, నిరంతరాయంగా అందించటం వీటి లక్ష్యమని పేర్కొంది.
ఈ మేరకు తెలంగాణ సహా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 162 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలోని 5 ఆసుపత్రులకు ఈ ప్లాంట్లు మంజూరయ్యాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి ఆయా రాష్ట్రాలతో సంప్రదించి ఆసుపత్రులను గుర్తించినట్లు పీఎంఓ తెలిపింది.
వీటి సామర్థ్యం 154.19 మెట్రిక్ టన్నులుగా పేర్కొంది. వీటి ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్ లభ్యత పెరగడమే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సమయానికి అందుబాటులో ఉంచడానికి కూడా వీలవుతుందని పేర్కొంది.