తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 115 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించారు సీఎం కేసీఆర్.అయితే తనకు మల్కాజ్గిరి, కుమారుడికి మెదక్ సీటు వస్తుందని ఆశీంచారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కానీ నిరాశే మిగలింది.ఇక సీఎం కేసీఆర్ స్వయంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తన బిడ్డలాంటిదని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీంతో తన కుమారుడికి టికెట్ వస్తుందని చివరివరకు ఆశించిన భంగపాటు తప్పకపోవడంతో తన సీటును వదులుకున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన త్వరలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ నుండి మల్కాజ్గిరి నుండి మైనంపల్లి, మెదక్ నుండి ఆయన కుమారుడు రోహిత్ బరిలో నిలవనున్నారు.
మైనంపల్లి బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నేపథ్యంలో మల్కాజ్ గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ, మంత్రి కేటీఆర్ను సన్నిహితుడు శంభీపూర్ రాజుకు మల్కాజ్గిరి టికెట్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కుత్బుల్లాపూర్ నుండి ఎమ్మెల్యేగా నిలబడేందుకు చివరి వరకు ట్రై చేశారు శంభీపూర్ రాజు. కానీ ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకాంద గౌడ్కే కేటాయించింది బీఆర్ఎస్.
అయితే అనూహ్యంగా బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా చేయడంతో రాజు పేరు తెరపైకి వచ్చిందిజ అలాగే ఆల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈమె మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్వాల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మేయర్ పదవి కోసం గట్టిగా పోటీపడ్డప్పటికీ ఈ పదవిని బీఆర్ఎస్ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె విజయలక్ష్మికి కట్టబెట్టారు. ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావు తప్పుకోవడంతో మల్కాజిగిరిలో విజయశాంతి రెడ్డిని పోటీ చేయించొచ్చని ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి పేరు కూడా తెరపైకి రావడంతో త్వరలోనే మల్కాజ్గిరి అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది.
