భారీ వర్షాలకు విజయవాడ నీట మునిగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా బెజవాడ జలదిగ్బందంలోనే ఉండగా ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదుకునే వారు లేక వరద బాధితుల పరిస్థితి దారుణంగా ఉంది. కళ్ల ఎదుటే శవాలు కనిపిస్తున్న వాటిని తీసే నాదుడు కూడా లేకుండా పోయింది.
సింగ్ నగర్లో 3 రోజుల నుంచి మృతదేహాన్ని తొలగించలేదు సిబ్బంది. పైపుల్ రోడ్డు పక్క సందులో నీట మునిగి మృతి చెందారు 50 ఏళ్ల వ్యక్తి. మృతదేహాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్న వాటిని తొలగించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత రాజశ్వేరిపేట శివారు ప్రాంత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్లు లేక పసిపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాంబే కాలనీ వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు రోజులుగా వరద ముంపుతో అవస్థలు పడుతున్నారు. తమను ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని, బురదలో ఆహారం పడేసి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు అయితే ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. టీడీపీకి ఓటు వేసినందుకు బాగా బుద్ధి చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
