ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసాయి. ఇప్పటివరకు తన మంచితనం, సహనం మాత్రమే అందరికి కనిపించిందని, కానీ ఎవరు తిరిగి పాత రాజకీయ పద్ధతులకు, దోపిడీ ధోరణులకు మళ్లితే తన గట్టితనాన్ని కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దయచేసి నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లకండి అని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
రాజకీయ పరిణామాలన్నింటినీ తాను ఎంతో దగ్గరగా మానిటర్ చేస్తున్నానని పవన్ వెల్లడించారు. “రాజోలు గడ్డ సాక్షిగా చెబుతున్నా… మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకోకండి,” అంటూ ప్రతిపక్షాలకు గట్టి సందేశం ఇచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకుల్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి స్వభావం కలిగిన వారు జనసేనలో ఉన్నా, వారిని బయటికి పంపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. “క్రిమినల్ ఆటిట్యూడ్తో ఉండే నాయకులు నాకు అవసరం లేదు,” అంటూ జనసేనలో క్రమశిక్షణ, నైతికత తప్పనిసరి అని చెప్పారు.
సంక్రాంతి తర్వాత కొబ్బరి రైతుల కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదు,కొబ్బరి రైతు సమస్యలతో రోడ్డెక్కనివ్వం,” అంటూ రైతులకు ధైర్యం చెప్పారు.
కోనసీమ కొబ్బరి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజోలు నియోజకవర్గం, శంకరగుప్తం ప్రాంతాల్లో డ్రెయిన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కొబ్బరి రైతులతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ముఖాముఖి జరిపి వారి సమస్యలు విన్నారు.
