తెలంగాణలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి… జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా పోవడానికి “తెలంగాణ వాళ్ల నర దిష్టి కారణం” అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ అనిరుధ్ రెడ్డి, ఇది తెలంగాణ ప్రజలను అవమానించే వ్యాఖ్య అని తెలిపారు.
“పవన్ కళ్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడలోనే ఉండిపో” అని ఆయన తీవ్రంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ను కొందరు “ప్యాకేజ్ స్టార్” అంటారనీ, నిజంగా ప్రజా మద్దతు ఉంటే టీడీపీని వదిలి ఒంటరిగానే పోటీ చేసేందుకు ధైర్యం చూపాలన్నారు.
పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, తాను కూడా ఆయన అభిమానినేనని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. “OG సినిమా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ నష్టపోకూడదనుకొని రూ.800 టికెట్ పెట్టి నేను వెళ్లి చూసా. కానీ తప్పు మాట్లాడితే చెప్పాల్సిందే” అని అన్నారు.
తెలంగాణ ప్రజలు ఎవరి మీదా నర దిష్టి పెట్టరు అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “నిజంగా తెలంగాణ వాళ్లకి నర దిష్టి ఉంటే ఇక్కడ ఆంధ్రా వాళ్లు ఎలా బిజినెస్ చేస్తారు? హైదరాబాదులో ఇరిగేషన్ నుంచి కన్స్ట్రక్షన్ వరకూ ఆంధ్రా వాళ్లే పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్లు ఎదగడానికి మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా?” అని ప్రశ్నించారు.
హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటే, తెలంగాణ ప్రజలపై అబద్ధపు వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. “మాది నర దిష్టి అయితే ఇక్కడ ఎందుకు ఆస్తులు కొనుగోలు చేస్తున్నావు? అన్ని అమ్ముకొని వెళ్లి విజయవాడలోనే ఉండు” అంటూ ఎద్దేవా చేశారు. తప్పు చేసిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
