వైన్స్ షాపుల నిర్వహణ విషయంలో తన పంతాన్ని నెగ్గించుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మునుగోడు నియోజకవర్గంలో సామాజిక క్రమశిక్షణ, రోడ్డు భద్రత దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట తరువాతే వైన్స్ షాపులు తెరవాలని, అలాగే సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూంలోకి వినియోగదారులను అనుమతించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా కొందరు వైన్స్ షాపు యజమానులు యథావిధిగా ఉదయాన్నే దుకాణాలు తెరవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు రంగంలోకి దిగి, నిబంధనలు ఉల్లంఘించిన వైన్స్ షాపులను బలవంతంగా మూసివేశారు. దీంతో వైన్స్ షాపు యజమానులు తమకు ఆర్థిక నష్టం కలుగుతుందని ఎక్సైజ్ శాఖను ఆశ్రయించారు. స్పందించిన ఎక్సైజ్ అధికారులు ఉదయం 10 గంటలకే స్వయంగా అక్కడికి చేరుకుని వైన్స్ షాపులను తిరిగి తెరిపించారు.
అయితే తన నిర్ణయాన్ని ఎలాగైనా అమలు చేయాలన్న పట్టుదలతో రాజగోపాల్ రెడ్డి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి వైన్స్ షాపుల పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించించారు. ఫలితంగా కేవలం ఒక్క రోజులోనే పదికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
ఈ చర్యల ప్రభావంతో సంస్థాన్ నారాయణపూర్ మండలంలో వైన్స్ షాపు యజమానులు అప్రమత్తమయ్యారు. ఇకపై మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్స్ షాపులు తెరవాలని నిర్ణయించుకోవడంతో, చివరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిబంధనలు అమలులోకి వచ్చినట్టయ్యాయి.
