జోగి రమేష్ తనపై జరిగిన దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన దాడి కేవలం వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకున్నది కాదని, అది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా బీసీ వర్గాల గొంతును నొక్కే ప్రయత్నమే ఈ దాడి వెనుక ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రశ్నించే స్వభావం ఉన్న నాయకులను భయపెట్టాలని, నిశ్శబ్దం చేయాలన్న కుట్రలో భాగంగానే తనపై దాడి జరిగిందని జోగి రమేష్ ఆరోపించారు.
తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి చేశారని, ఇది యాదృచ్ఛిక ఘటన కాదని ఆయన అన్నారు. టీడీపీ నేత లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని కన్నుసన్నల్లోనే బ్లేడు బ్యాచ్, గంజాయి మూకలను పంపించి తనపై దాడి చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన చర్యలు మరొకటి ఉండవని వ్యాఖ్యానించారు.
తాను చేయని తప్పుకు 83 రోజులు జైలులో గడపాల్సి వచ్చిందని, అయినా కూడా తనపై కక్ష సాధింపు చర్యలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసినా మీకు రాక్షసానందం తీరలేదా? అంటూ ప్రశ్నించారు. తనపై దాడి చేయడమే కాకుండా, దాడికి గురైన తనపైనే తిరిగి కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.
ప్రజల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం తన పోరాటం కొనసాగుతుందని జోగి రమేష్ స్పష్టం చేశారు.
