స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై లోక్సభలో గందరగోళం నెలకొనగా సభ మంగళవారంకు వాయిదా పడింది. స్పీకర్ ముందుగా తనకు మాట్లాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని పేర్కొంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కలకలం కారణంగా లోక్సభ కార్యకలాపాలు పదే పదే అంతరాయం కలగడంతో చివరకు సభను మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.
గందరగోళం మధ్య రాహుల్ గాంధీ, తనకు నిజంగానే మాట్లాడే అవకాశం ఇస్తారా అని ప్రశ్నిస్తూ, స్పీకర్ గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. దీనికి స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, ఈ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు స్పీకర్ ప్రయత్నించారని తెలిపారు. పరిష్కారం కనుక దొరికితే సభ సజావుగా నడుస్తుంది. అప్పుడు ముందుగా రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఇతర పార్టీల నేతలు, చివరగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మాట్లాడతారని స్పీకర్ చెప్పారు అని రిజిజు వెల్లడించారు.
ఫిబ్రవరి 3 నుంచి లోక్సభలో నిరంతర అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని ప్రతిపక్షాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వం లోక్సభలో ప్రతిపక్ష పాత్రను పరిమితం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. సభలో విభేదాలకు స్థానం లేకుండా చేస్తున్నారని విమర్శించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వడం లేదని కే.సి. వెంకటేశ్ అన్నారు. ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీకి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. స్పీకర్ స్వయంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ సభలో ప్రతిపక్షానికి ఎలాంటి స్థానం లేదు అని ఆరోపించారు.
