ఓం బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షం తీసుకొచ్చిన తీర్మానం లోక్సభలో వాయిస్ ఓటుతో తిరస్కరించబడిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లేదా ఇతర సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. సభ నియమాల ప్రకారం ప్రతి సభ్యుడికి మాట్లాడే హక్కు ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని మహ్మద్ జావేద్ ప్రతిపాదించగా పలువురు ప్రతిపక్ష సభ్యులు మద్దతు ఇచ్చారు. అయితే చర్చ అనంతరం లోక్సభలో వాయిస్ ఓటుతో ఆ తీర్మానం తిరస్కరించబడింది. చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్పై తీర్మానం తీసుకురావడం ద్వారా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 13న ముగిసిన తర్వాత, రెండో విడత మార్చి 9న ప్రారంభమైంది. స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన తర్వాత తొలిసారిగా గురువారం ఆయన సభలోకి వచ్చి కార్యకలాపాలను నిర్వహించారు.
సభలో మైకులను స్పీకర్ నియంత్రిస్తారని వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. స్పీకర్ దగ్గర మైకులను ఆన్ లేదా ఆఫ్ చేసే బటన్ ఉండదని, సభ్యులు తమకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడగలరని వివరించారు.
