కేరళం రాజకీయాలపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఆదూర్లో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ ఎన్నికలు యూడీఎఫ్ (UDF) మరియు “CPI(M)-బీజేపీ కలయిక” మధ్య పోరాటమని పేర్కొన్నారు.
కేరళలో బీజేపీకి “హిడెన్ హ్యాండ్” ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అని, అందుకే యూడీఎఫ్ అధికారంలోకి రావడం బీజేపీ కోరుకోవడం లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తో కాంగ్రెస్కు సిద్ధాంతపరమైన పోరాటం ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను 36 కేసులు ఎదుర్కొన్నానని, 55 గంటల పాటు విచారణకు హాజరయ్యానని చెప్పారు.అయితే, కేరళ ముఖ్యమంత్రి లేదా ఎల్డీఎఫ్ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇటీవల పాలక్కాడ్ పర్యటనలో శబరిమల అంశంపై మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. శబరిమల అయ్యప్ప ఆలయంకు సంబంధించిన సమస్యలపై మోదీ స్పందించకపోవడం, బీజేపీ-ఎల్డీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయనే అనుమానాలకు దారి తీస్తుందని అన్నారు.
యూడీఎఫ్ అధికారంలోకి వస్తే శబరిమల ఆలయానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
