యూరి సెక్టార్లో భారత భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఒక పాకిస్థానీ ఉగ్రవాది హతమయ్యాడు. ఇండియన్ ఆర్మి మరియు జమ్మూ కశ్మీర్ పోలీస్ కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సరిహద్దు ప్రాంతంలో చొరబాటుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందడంతో మార్చి 14–15 మధ్య రాత్రి బుచ్చార్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. అనుమానాస్పద కదలికలు గమనించిన భద్రతా దళాలు అప్రమత్తమై దాడికి సిద్ధమయ్యాయి.
అడవిలోని పొదల్లో అనుమానాస్పద వ్యక్తి కదలికలను గమనించిన సైనికులు అతడిని ఆపేందుకు హెచ్చరించారు. అయితే ఉగ్రవాది అప్రతిహతంగా కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పాకిస్థానీ ఉగ్రవాది హతమయ్యాడని సైన్యం తెలిపింది.
ఈ ఎన్కౌంటర్ అనంతరం ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒక AK రైఫిల్, పిస్టల్స్ మరియు పెద్ద మొత్తంలో బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరికొందరు చొరబాటుదారులు ఉన్నారా అనే అనుమానంతో ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా పూంచ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సమయంలో ఒక సైనిక అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సుబేదార్ సందీప్ కుమార్ ధాకా ఆపరేషన్ సమయంలో ప్రమాదవశాత్తూ జారి పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందారు.
