తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆయన కీలక పాత్రలో నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ‘‘పోరాటం ఎంత కఠినంగా ఉంటే.. విజయం అంత ఘనంగా ఉంటుంది. జులై 23న జననాయగన్ వచ్చేస్తున్నాడు’’ అని చిత్రబృందం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది. దీంతో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యలు, వరుస కోర్టు కేసులు, మరియు విచారణల కారణంగా సినిమా విడుదల పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తొలగించుకుని, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) పునః పరిశీలన తర్వాత ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ను జారీ చేసింది. దాదాపు 183 నిమిషాల (3 గంటల 3 నిమిషాలు) నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమితా బైజు మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో, ‘జన నాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ సమస్యల నుంచి బయటపడి, ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.
