చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను గుడికి తీసుకెళ్లే సాకుతో తీసుకెళ్లి భార్య హత్య చేయించింది. కుప్పం డీఎస్పీ పార్థసారధి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటన గుడుపల్లె మండలంలో చోటుచేసుకుంది.
తమిళనాడులోని సూలగిరి పరిధికి చెందిన రమేష్, కుప్పం నియోజకవర్గానికి చెందిన హాసిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఒక ఏడాది వయసున్న మౌలికశ్రీ అనే కుమార్తె ఉంది. మంగళవారం వీరు సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి బైక్పై బయలుదేరారు. అయితే రాత్రయినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు విచారణ చేపట్టి, ఆలయ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. మొదట భర్త, బిడ్డతో హాసిని బైక్పై ఆలయానికి వెళ్లడం కనిపించింది. అయితే తిరిగి వచ్చేటప్పుడు భర్త తెచ్చిన బైక్పైనే హాసిని మరో ఇద్దరు యువకులతో కలిసి వెళ్లడం పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించగా, రమేష్ మృతదేహం లభ్యమైంది.
ఔభార్య హాసిని తన ప్రియుడితో కలిసి మరో ఇద్దరు యువకుల సాయంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
