అసెంబ్లీ సమావేశాలను బహిస్కరించి సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్. ఎవరు ఎన్ని చెప్పినా తన నిర్ణయమే ఫైనల్ అన్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాలతో అందరికి షాకులిస్తున్నారు వైసీపీ అధినేత. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ఆయన నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జగన్ తీసుకున్న నిర్ణయంపై పార్టీలోని నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సమావేశాల బహిస్కరణ సాకు మాత్రమేననె విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా.. పాదయాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జగన్ యాత్ర నిర్వహిస్తున్నారని తెలిసే, సమయం చూసుకుని అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ ఏర్పాటు చేసిందంటూ పలువురు వైకాపా నేతలు విమర్శించారు
మరో వైపు అసెంబ్లీని ఎదుర్కొనేందుకు ధైర్యం లేకనే కుంటి సాకులు చెబుతున్నారంటూ టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు దాడి మొదలుపెట్టారు. ఇతర ఎమ్మెల్యేల మీద జగన్ కు నమ్మకం లేదని అందుకే ఇలా బహిష్కరణను తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిలదీయాల్సింది పోయి, కుంటి సాకులతో పారిపోతున్నారనే అపకీర్తి మూటకట్టుకుంటున్నారు. ఇక వైసీపీ వాళ్లు కూడా తమపై జగన్కు నమ్మకం లేదా ? అని పైకి చెప్పకపోయినా లోపల మాత్రం మండిపడుతున్నారు.
ఇప్పటికె పాదయాత్రను రెండు సార్లు వాయిదా వేసుకున్న జగన్ ..మరో పది రోజులు వాయిదా వేసుకోవడం పెద్ద సమస్యే కాదు. అసెంబ్లీలో జగన్ ఒక్కరిదే వాయిస్. తర్వాత స్థాయి నాయకులెవ్వరూ పెద్దగా మాట్లాడిన చరిత్ర గత సమావేశాల్లో లేదు. పోనీ, జగన్ లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశాలను నెట్టుకుని రాగలరా అంటే.. ఆ నమ్మకం జగన్ కే ఉన్నట్టు లేదనేది కూడా కొంత వాస్తవమే. జగన్కే మాట్లాడటానికి సమయం ఇవ్వనప్పుడు ఇక ఎమ్మెల్యేలకు ఏమాత్రం అవకాశంఇస్తారా అన్నది సందేహమే.