వరుస సినిమాలు చేస్తున్నా సరైన విజయం లేదు.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నా ఆడడం లేదు. అలాగని బాధపడడం లేదు నటుడు గోపీచంద్. విలన్గా జయం, నిజం సినిమాల్లో క్రూరత్వం ప్రదర్శించిన నటుడు గోపీచంద్ సినిమాల్లో అంతగా రాణించడం లేదు.
కెరీర్ ప్రారంభంలో బాగా విజయాలు అందుకున్న అతడు ఇప్పుడు సరైన విజయం లేక సతమతమవుతున్నాడు. అయినా తగ్గకుండా ఈసారి కొత్త దర్శకుడితో వస్తున్నాడు. గోపీచంద్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. నూతన దర్శకుడు చక్రవర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గోపీచంద్ సరసన మెహ్రీన్ నటిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాకు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చాడు. సురేందర్రెడ్డి కూడా హాజరై పూజలు చేశారు. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి చిత్రాల నిర్మాత కె.కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి చేతులు మారినట్లు తెలుస్తోంది. బడ్జెట్ లెక్క రూ.20 కోట్ల వరకు ఉండడంతో దిల్ రాజు వెనక్కి తగ్గారు.