ఇటీవలే ఆయన్ను అందరూ ఆకాశానికెత్తేశారు. అద్భుతమైన కథకుడు అంటూ.. తెగ ప్రశంసించారు. ఆయన రచయితగా పనిచేసిన రెండు సినిమాలు వరసగా విజయవంతం కావడంతో అందరూ ఆయనను తెగ మెచ్చుకున్నారు. ఆయన ఒక అద్భుతమైన రచయిత అంటూ ప్రశంసించారు.
అయితే ఇప్పుడు ఆయన ఇరకాటంలో పడిపోయాడు. విజయేంద్ర ప్రసాద్ విరిచత “భజరంగీ భాయ్ జాన్” సినిమా కథ తనది అని.. దాన్ని కాపీ కొట్టి ఆ సినిమాను రూపొందించారని ఇప్పుడు ఒక బాలీవుడ్ రచయిత కోర్టుకు ఎక్కాడు. ఏకంగా 50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ లో ఆ సినిమాకు రచయితగా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ ను, హీరో సల్మాన్ ను, దర్శకుడు కబీర్ ఖాన్ తోపాటు నిర్మాణ సంస్థలను కూడా ప్రతివాదులుగా చేర్చాడా రచయిత. తను కథను ఆ నిర్మాణ సంస్థకు వివరించానని.. వారు తన దగ్గర దాన్ని తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించి ఆ తర్వాత సినిమాగా తీశారని.. అందులో తన కథలోని సిములారిటీస్ ఎన్నో ఉన్నాయని ఆ రచయిత ఆరోపిస్తున్నాడు. మరి ఏదో ఆరోపించడం కాకుండా.. ఏకంగా కోర్టుకు కూడా ఎక్కాడు.
దీంతో.. ఇప్పుడు భజరంగీ భాయ్ జాన్ యూనిట్ అంతా ఇరకాటంలో పడిపోయింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు అక్టోబర్ 21 న హాజరు కావాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరి ఈ వివాదం ఎంత వరకూ వెళుతుందో చూడాలి!
