వివాహ కార్యక్రమం సంతోషాలు నింపే వేడుక. ఈ వేడుకకు ముందు నిర్వహించే కార్యక్రమం నిశ్చితార్థం. అయితే ఈ సమయంలో బంధువులను, స్నేహితులను సక్రమంగా మర్యాద ఇవ్వకపోయినా.. గౌరవం తగ్గినా.. తీవ్ర వివాదానికి దారితీస్తాయి. అందుకే భోజనానికి, ఇతర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటి కోసం ఓ పది మందిని ప్రత్యేకంగా కేటాయించాలి. అప్పుడు వేడుక ఆనందంతో ముగిసే అవకాశం ఉంటుంది. లేదంటే అలకలు, వివాదాలు రాజుకుని ఫంక్షన్ కాస్త జంక్షన్గా మారి విషాదంతో ముగిసే అవకాశం ఉంది. అలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుని విషాదం నింపింది.
చికెన్ వడ్డించలేదనే కారణంతో వడ్డిస్తున్న వ్యక్తిని ఓ వ్యక్తి హతమార్చిన ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్ పరిధి షాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షాగంజ్ ప్రాంతంలోని హరేహత్ మంజిల్ అనే ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి (ఏప్రిల్ 1) ఓ యువకుడి నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు బంధువు అశ్వాక్ అనే వ్యక్తి హాజరయ్యాడు. నిశ్చితార్థం అనంతరం భోజనం చేయడానికి వెళ్లాడు. అక్కడ వడ్డించే వ్యక్తి చికెన్ సక్రమంగా అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ కోపంతో తన స్నేహితులకు ఫోన్ చేసి ఫంక్షన్హాల్కు రప్పించాడు. అశ్వాక్ మిత్రుల్లో ఒకరు వడ్డిస్తున్న అన్వర్తో గొడవ పెట్టేసుకున్నాడు. ఈ క్రమంలో అన్వర్ కడుపులో కత్తితో పొడిచాడు. వీరిని అడ్డుకోబోయిన సోహైల్ వీపుపై కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుస్సేనీ ఆలం పోలీసులు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
