కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్పూర్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ను కోర్టు దోషీగా తేల్చింది. శిక్ష ఖారారైన తరువాత జోధ్పూర్ సెంట్రల్ జైలుకు సల్మాన్ను తరలించనున్నారు.
1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సంగతి తెలిసిందే. జోధ్పూర్కు సమీపంలో గల కంకణి గ్రామంలోని భగోదా కీ ధనిలో రెండు కృష్ణ జింకలను హతమార్చినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో సల్మాన్ఖాన్పై వన్యప్రాణి సంరక్షణ చట్టం(సెక్షన్ 51) కింద.. ఇతర నటులపై దీంతో పాటు ఐపీసీ 149 సెక్షన్ కింద అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని పేర్కొన్న న్యాయమూర్తి, సల్మాన్ కు మరికాసేపట్లో శిక్షను ఖరారు చేయనున్నారు.
జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో, శిక్ష పడ్డ వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు, అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించగా, వెంటనే పై కోర్టుకు అప్పీలు చేసుకునే నిమిత్తం శిక్షను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసేందుకు సల్మాన్ తరపు న్యాయవాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.