బిగ్బాస్ సీజన్ 2… మొదటి సీజన్తో పోలిస్తే కాస్త చప్పగానే సాగుతోంది. బలమైన కంటెస్టెంట్లు లేకపోవడం.. ఎన్టీఆర్ హోస్ట్గా చేసిన షోను ఇప్పుడు నాని చేయడం.. ప్రారంభం నుంచే బిగ్బాస్ హౌస్లో సన్నివేశాలు రసవత్తరంగా సాగకుండా.. కొందరు కలిసి ఓ జట్టుగా మారిపోయి.. మిగతా వారందరినీ టార్గెట్ చేయడంతో హౌస్లోని ముగ్గురు నలుగురు తప్ప మిగతా వారంతా సైలెంటయిపోవడం వంటివి సీజన్ 2పై అంచనాలను తగ్గించేశాయి. అయినా.. బిగ్బాస్లో చివరిగా ఎవరో ఒక విజేతను ఎంపిక చేయక తప్పదు. బిగ్బాస్ ప్రారంభమై నెల రోజులు పూర్తయింది. వంద రోజుల షోలో.. మొదటి అంకం పూర్తియింది. 17మంది కంటెస్టెంట్లలో ప్రస్తుతం ఐదుగురు బయటకెళ్లిపోగా.. 12మందే మిగిలారు. వీరిలో విజేతగా నిలిచేది ఎవరనే దానిపై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం హౌస్లో గీతామాధురి, టీవీ9 దీప్తి, అమిత్, బాబూగోగినేని, కౌశల్, దీప్తి సునయన, రోల్రైడా, తనిష్, నందిని, సామ్రాట్, గణేశ్ , తేజస్వి కలిపి ఇంకా 12మంది హౌస్లో ఉన్నారు. వీరిలో విజేతగా ఎవరైతే బాగుంటుందనే దానిపై ఇప్పటికే ప్రేక్షకులు తమ అభిప్రాయాలను యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వేదికలపై వెళ్లడిస్తున్నారు. వారందరి అభిప్రాయాలు, బిగ్బాస్ హౌస్లోని కంటెస్టెంట్లు ఈ నెల రోజుల్లో సంపాదించిన ఫాలోయింగ్, వ్యతిరేకత ఆధారంగా చూస్తే.. గీతామాధురి, కౌశల్ ఈ ఇద్దరికే బిగ్బాస్ కిరీటం ధరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు కన్పిస్తోంది. వీరి తర్వాత స్థానాల్లో బాబూ గోగినేని, అమిత్ తివారీ నిలిచేందుకు ఆస్కారం ఉంది.
బిగ్బాస్ విజేత అంటే.. పరిపూర్ణంగా అన్ని విషయాల్లోనూ మెప్పించేలా ఉండాలి. ప్రధానంగా వ్యక్తిత్వం విషయంలో ఒకేలా ఉండాల్సి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం వంటివి బిగ్బాస్ హౌస్లో ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ.. అలా మారిపోకుండా.. తాను హౌస్లోనికి ప్రవేశించినప్పుడు ఎలా ఉన్నారో.. బయటకు వచ్చేటప్పుడు అంతే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ రెండు లక్షణాలు బిగ్బాస్ హౌస్లో మిగిలిన 12మందిలో కేవలం ఈ నలుగురే కన్పిస్తున్నారు. గీతామాధురి ముక్కుసూటి తత్వం, ఎక్కడా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కు లొంగే రకం కాదు. తనకు నచ్చితే నచ్చిందని.. లేదంటే లేదంటూ నిక్కచ్చిగా చెప్పే రకం. ఇప్పటికే హౌస్లో అందరి హాట్ ఫేవరెట్గా గీతా గుర్తింపు తెచ్చుకుంది. అవతల కొందరు ఓ గ్రూప్గా ఏర్పడి ఉన్నా.. ఐ డోంట్ కేర్.. నేను ఏది నమ్మితే దానికోసమే నిలబడతాననే తత్వం గీతను ప్రత్యేకంగా నిలుపుతోంది. విజేతగా నిలిచేందుకు అవకాశం ఉన్న మరో కంటెస్టెంట్ కౌశల్ మందా.
హౌస్లో జరుగుతున్న పక్షపాత ధోరణిపై ఎదురు తిరిగి మొదటి నుంచి అది తప్పనే ధోరణిలో తేజస్వి గ్రూపిజాన్ని వ్యతిరేకిస్తున్నాడు. బిగ్బాస్ హౌస్లో నలుగురు కంటెస్టెంట్లు కలిసి గ్రూపుగా మారిపోయి.. మిగతా ఒక్కొక్కరిగా ఉన్న వారిని వేధించడం, బయటకు పంపించేందుకు నామినేట్ చేయడం వంటివి సరికాదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నాడు. దీంతో గ్రూప్ను నడుపుతున్న తేజస్వి.. కౌశల్పై తాను దాడి చేసి తిట్టడమే కాకుండా.. సామ్రాట్, తనీష్, దీప్తి సునయన, భానుశ్రీ, కిరీటీ ఇలా అందరితోనూ దాడి చేయిస్తోంది. దీంతో బిగ్బాస్ హౌస్లో కౌశల్ ఓ పోరాట యోధుడిగా మారిపోయాడు. అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఈ నెల రోజుల్లోనే వచ్చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. కౌశల్ గ్రేట్, కౌశల్ సింహం, కౌశల్ టైగర్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫాలోయింగ్ చూసి.. బిగ్బాస్ నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోతున్నారిప్పుడు. అందుకే.. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే.. మాత్రం కిరీటం వీరిద్దరికి వచ్చే అవకాశం కన్పిస్తోంది. ప్రేక్షకులే బిగ్బాస్ న్యాయ నిర్ణేతలని ప్రకటిస్తున్నందున వీళ్లకే ఎక్కువ విజయ అవకాశాలున్నాయి. వీరిద్దరి తర్వాత.. కొంచెం అటూ ఇటైనా బ్యాలెన్స్గా ఉన్నవాళ్లు బాబూ గోగినేని, అమిత్ తివారీ. బాబూ గోగినేని వ్యక్తిత్వం విషయంలో తనకు తానులాగే ఉంటున్నారు.
అయితే.. తేజస్వి చేసే న్యూసెన్స్కు బాబూ గోగినేని మద్దతు ఇస్తున్నారు. ఆమె అల్లరి నచ్చిందని అందుకే సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పటికి చాలాసార్లు బాబు ప్రకటించారు. ఇదే ఆయన కొంప ముంచుతోంది. తేజస్విని అసహ్యించుకునే వాళ్లంతా బాబూ గోగినేనికి దూరమవుతున్నారు. ఇది మార్చుకుంటే.. బాబూ గోగినేని సైతం విన్నర్ రేసులో ఉంటారు. అమిత్ తివారీ.. టాలీవుడ్ చిత్రాల్లో క్రూరమైన విలనిజం ప్రదర్శిస్తుంటాడు. బిగ్బాస్ హౌస్లో మాత్రం భయ్యాగా, బ్రోగా, మంచి పనోడిగా అందరి దగ్గరా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు. కానీ.. హౌస్లో ఎంత మంచిగా ఉన్నా.. ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు రావాలంటే ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. అది అమిత్లో లోపిస్తోంది. ఈ విషయంలో అమిత్ మారి.. బిగ్బాస్ హౌస్లో ఆడాల్సిన అసలైన గేమ్ను ఆరంభిస్తే.. విజేతల రేస్లోకి ఎంటరయ్యే అవకాశముంది.